ePaper
Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeకరీంనగర్గంగాధరకాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి.. బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి.. బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి

📰 Generate e-Paper Clip

 

గంగాధర మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మెచినేని నవీన్‌ రావు

జనోదయ గంగాధర ఆగస్టు 07:

గంగాధర మండలంలోని నారాయణపూర్ ముంపు గ్రామ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని గంగాధర మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మెచినేని నవీన్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నేటికీ మాట నిలబెట్టుకోలేదని అన్నారు.

ప్రజలు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, దానిని బీఆర్ఎస్ ప్రేరేపించిందంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు ఎప్పుడూ వాస్తవ పరిస్థితులను వివరించారని, సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి సాధ్యాసాధ్యాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు అసాధ్యమైన హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా బీఆర్ఎస్‌పై నిందలు వేయడం సరికాదన్నారు.

నారాయణపూర్ మాత్రమే కాకుండా నియోజకవర్గంలోని 33 గ్రామాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దర్శకుర్తిని మండలంగా చేస్తామని, కుడికాలువ సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. లేకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు.

గ్రామసభలో జరిగిన పరిణామాలకు బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన, అది పూర్తిగా గ్రామానికి సంబంధించిన అంతర్గత అంశమని తెలిపారు. గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్‌లు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేను ప్రశ్నించడం సహజమని అన్నారు.

ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రశ్నించడం బీఆర్ఎస్ బాధ్యతేనని, ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని నవీన్‌రావు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాన్ని విమర్శించడం వల్ల ప్రభుత్వ వైఫల్యాలు దాచలేరని అన్నారు.

బీఆర్ఎస్‌పై నిరాధార ఆరోపణలు, బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన ఆయన, గ్రామ సమస్యలను సున్నితంగా పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, లేకపోతే ప్రజలే తగిన రాజకీయ తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.

చివరగా, నారాయణపూర్ ముంపు గ్రామ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలపై కేసులు పెట్టడం కాకుండా వారితో చర్చించి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular