-మణికంఠ కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించిన
-14వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్
జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 16:
14వ డివిజన్ పరిధిలోని మణికంఠ కాలనీ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బుధవారం కాంగ్రెస్ 14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధి లైట్ల వంటి వివిధ సమస్యలను డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని 14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ ఈ సందర్భంగా తెలిపారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు అడుగుజాడల్లో నడుస్తూ.. డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ ఒక వినూత్న సందేశాన్ని ఇచ్చారు. “శాలువాలు, బొకేలు వద్దు… పెన్నులు, పుస్తకాలే ముద్దు.”
తనను కలిసే వారు శాలువాలు, బొకేలు తీసుకురావడం కంటే విద్యార్థులకు ఉపయోగపడే పెన్నులు, పుస్తకాలు తీసుకురావాలని ఆయన కోరారు. సమాజంలో విద్యకు ప్రాధాన్యం పెంచే ఈ ఆలోచనను ప్రజలు హర్షించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇంతియాజ్ మణికంఠ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు పోతు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మణికంఠ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంచ శ్రీనివాస్, కాలనీ డెవలప్మెంట్ అధ్యక్షులు పోతు చంద్రశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెల్శాల రమేష్ బాబు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





