జనోదయ,కమాన్పూర్,ఏప్రిల్ 16:
కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల స్థాయి సమావేశం ప్రజల్లో చైతన్యం నింపింది. మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో చేపడుతున్న చర్యలను వివరిస్తూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి పరిష్కరించడంలో సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ప్రజా పాలనను మరింత సమర్థవంతంగా గ్రామ స్థాయికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్, ఎస్ఐ, మండల విద్యాధికారి, వ్యవసాయ అధికారి, విద్యుత్ శాఖ ఇంజనీర్, వైద్యాధికారి, పశువైద్యాధికారి, ఇందిరమ్మ గృహ నిర్మాణ విభాగ ఇంజనీర్, మిషన్ భగీరథ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, వ్యవసాయ మరియు ఉపాధి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
ప్రజా సంక్షేమానికి అంకితమైన ఈ సమావేశం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.





