జనోదయ,పెద్దపల్లి మార్చి 13:
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి రైతు వేదికలో శుక్రవారం రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికాలపై అవగాహన కల్పించే సదస్సు నిర్వహించారు.వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తల బృందం పాల్గొని రైతులకు పంటల నిర్వహణపై సమగ్ర మార్గనిర్దేశం చేసింది.
సదస్సులో విత్తనాల ఎంపిక,ఎరువుల సమర్థ వినియోగం,నీటి నిర్వహణ పద్ధతులు,పంటల బీమా,మార్కెటింగ్ సదుపాయాలు వంటి కీలక అంశాలపై రైతులకు వివరించారు.అదేవిధంగా పెస్టిసైడ్ టాలిరెంట్ హెచ్.టి పత్తి సాగు వల్ల కలిగే దుష్ప్రభావాలు,భూసార పరీక్ష కార్డు ఆధారంగా ఎరువుల వినియోగం,ప్రకృతి వ్యవసాయం ద్వారా లభించే ప్రయోజనాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కిసాన్ పథకం 22వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా ఏర్పాటు చేసి రైతులు వీక్షించేలా చేశారు.పథకానికి అర్హత ఉన్నప్పటికీ లబ్ధి అందని రైతులకు,లబ్ధిదారులకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి వ్యవసాయ విస్తరణ అధికారి బి.శశిధర్,వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్,జయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి ఎం.యోజన,ఈసాలా తక్కలపల్లి సర్పంచ్ బండి శ్రీనివాస్,కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ పి.కిరణ్,డాక్టర్ వై.వెంకన్న,డాక్టర్ టి.వినోద్ పాల్గొన్నారు.అధిక సంఖ్యలో రైతులు హాజరై పంటల సాగుపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.





