జనోదయ,కమాన్పూర్ ఫిబ్రవరి 21:
కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడల్లో ప్రతిభ చాటుతూ బంగారు పతకం సాధించింది. శనివారం హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన 18 సంవత్సరాల విభాగం 400 మీటర్ల పరుగుపందెంలో ఆమె అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
నల్లవెల్లి శంకర్–భారతి దంపతుల రెండవ కుమార్తె అయిన ఆనంది ప్రస్తుతం కమాన్పూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. క్రమశిక్షణతో కూడిన సాధన, కోచ్ మార్గదర్శకత్వం ఆమె విజయానికి పునాది అయ్యాయి.
ఆనంది విజయంపై కోచ్ సుబ్బారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా అధికారి సురేష్, పెద్దపల్లి అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి గట్టయ్య, కమాన్పూర్ మండల విద్యాధికారి విజయ్ కుమార్ గౌడ్, శారీరక విద్య ఉపాధ్యాయులు జావేద్, రేణుక, విష్ణు, ప్రణయ్, కొమురయ్యలు అభినందనలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఆనంది విజయంతో కమాన్పూర్ క్రీడా వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.





