జనోదయ,కమాన్పూర్, సెప్టెంబర్ 6:
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమాన్పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన బర్ల రమేష్ కుమార్తె మచ్చ సుమాంజలి–స్వామి దంపతుల నాలుగు నెలల కుమారుడు తీవ్రమైన మూర్ఛలతో బాధపడుతూ హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి వైద్య ఖర్చులకు సుమారు రూ.14 లక్షలు అవసరమవుతాయని వైద్యులు సూచించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.
చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ ఆధ్వర్యంలో సభ్యులు స్పందించి రూ.1,16,000 ఆర్థిక సాయం సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఆదివారం కమాన్పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, జూలపల్లి బీఆర్ఎస్ నాయకుడు పోలుదాసరి సాయి, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబానికి అవసరమైన సమయంలో ఆర్థిక చేయూత అందించడం అభినందనీయమన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ సేవా దృక్పథంతో ముందుకు సాగుతూ, దాతలు మరియు సేవాభావం ఉన్నవారిని ఒక వేదికపైకి తీసుకొచ్చి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. పసి ప్రాణాన్ని కాపాడేందుకు అందించిన రూ.1.16 లక్షల సాయం ఆ కుటుంబానికి కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, క్లిష్ట సమయంలో కొండంత ధైర్యాన్ని ఇచ్చిన మానవతా చేయూత అని పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తే మరెన్నో కుటుంబాలకు అండగా నిలవవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో కమాన్పూర్ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మెడగోని విజయ్ గౌడ్, మహమ్మద్ ముస్తాక్, మల్యాల విజయ్ గౌడ్, గుర్రం లక్ష్మిమళ్ళు, గరిగంటి విష్ణు, మహమ్మద్ అజ్గర్, జూపాక భాను, దయ్యాల రాజు, సయ్యద్ నజీబ్, ఈరగోని సాయి, మంథని వినయ్, నల్లెల్లి ఈశ్వర్, నారగోని ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





