మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యం: ఎస్సై వంశీకృష్ణ
జనోదయ, గంగాధర జూన్ 15:
గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో ఆదివారం ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ నుంచి వచ్చిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు గ్రామంలోని పాన్ షాపులు, వైన్స్ పర్మిట్ రూమ్లు, పాఠశాలలు మరియు ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి.
అక్రమంగా మాదక ద్రవ్యాలు, గంజా వంటి నిషేధిత పదార్థాలను నిల్వ ఉంచుతున్నారా లేదా విక్రయిస్తున్నారా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వస్తువుల కోసం తనిఖీలు నిర్వహించారు.
ప్రజల్లో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పించడం, నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.






