-కుమారుడి తప్పును కప్పిపుచ్చేందుకు బాధితురాలిని వేధిస్తారా?:
-కాంగ్రెస్ నేత అడుప మహేష్ ధ్వజం
జనోదయ వరంగల్ ప్రతినిధి (Siluveru Srinivas):
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీరు అత్యంత అమానవీయంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, సోషల్ మీడియా మాజీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అడుప మహేష్ తీవ్రంగా మండిపడ్డారు. ‘బేటీ బచావో’ ఏమైంది అని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్ వల్ల అన్యాయం జరిగిందని ఒక బాలిక న్యాయం కోరుతుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఆమెకు భరోసా ఇవ్వాల్సింది పోయి మరింత మానసిక క్షోభకు గురిచేసేలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.‘బేటీ బచావో’ అంటూ దేశవ్యాప్తంగా ప్రగల్భాలు పలికే బీజేపీ నేతల అసలు స్వరూపం ఈ ఘటనతో బయటపడిందని విమర్శించారు. అధికార బలంతో బీజేపీ నాయకులు సామాన్యుల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని స్పష్టం చేశారు. స్వయానా కేంద్ర మంత్రి కుమారుడు సాయి భగీరథ్ ఈ ఉదంతంలో నిందితుడిగా ఉన్నందున అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని హెచ్చరించారు. తక్షణమే ఆ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉండి పోరాడుతామని అడుప మహేష్ వెల్లడించారు.





