జనోదయ, ఏప్రిల్ 08 – గంగాధర:
తెలంగాణ రాష్ట్రంలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను అందజేస్తోందని పేర్కొన్నారు.
బుధవారం గంగాధర మండలం మధురానగర్లోని ప్రజా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నియోజకవర్గంలోని 140 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది హాజరు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి ఈ స్మార్ట్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సాంకేతికతను వినియోగించుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గంగాధర ప్రాజెక్ట్ సీడీపీవో సల్వాజి నర్సింగారాణి, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రాము, అంగన్వాడీ సూపర్వైజర్లు సంతోషి, రేణుక, సుధారాణి, మస్రత్, మిషన్ వాత్సల్య సామాజిక కార్యకర్త కవిత దేవి తదితరులు పాల్గొన్నారు.






