జనోదయ,గంగాధర ఫిబ్రవరి 11:
గంగాధర మండలంలో మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.మండలంలోని తాడిజెర్రి గ్రామానికి చెందిన శ్రీరాం మహేష్ (35) ఉప్పరమల్యాల–రంగారావుపల్లి గ్రామాల మధ్య జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయారు.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం,మహేష్ కొద్ది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చారు. కుటుంబం గంగాధర ప్రధాన కూడలిలో నివాసం ఉంటోంది.తాడిజెర్రి నుంచి గంగాధర వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వాహనం అదుపుతప్పి పడిపోయిందా? లేక మరేదైనా వాహనం ఢీకొట్టిందా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.ద్విచక్రవాహనం రోడ్డుపై పడిఉండగా,మహేష్ సమీప పొలంలో తీవ్ర గాయాలతో కనిపించారు.
తక్షణమే ఆయనను కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.మహేష్కు భార్య నర్మద,ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.
మృతుడి తల్లి కంప్లైంట్ మేరకు సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.ప్రమాదానికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది, సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఆక్సిడెంట లేక బైక్ అదుపు తప్పి పడిపోయాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది.





