ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్చొప్పదండి రాజకీయాల్లో మళ్లీ వేడి పెంచిన టికెట్ వివాదం

చొప్పదండి రాజకీయాల్లో మళ్లీ వేడి పెంచిన టికెట్ వివాదం

📰 Generate e-Paper Clip

 🔹మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం
🔹టికెట్ ఇవ్వలేదంటూ దంపతుల తీవ్ర ఆందోళన,రాజకీయ కలకలం
🔹రిజర్వేషన్ నిబంధనలే బీ–ఫామ్ నిరాకరణకు కారణం: మాజీ ఎమ్మెల్యే వివరణ
జనోదయ,గంగాధర ఫిబ్రవరి 3:

చొప్పదండి మున్సిపాలిటీలో టికెట్ వివాదం రాజకీయ కలకలం రేపింది. చైర్మెన్ అభ్యర్థిత్వానికి బీ–ఫామ్ ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నివాసం ముందు టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు కళ్ళేపెల్లి మహేష్ – కోమలత దంపతులు తీవ్ర నిరసనకు దిగారు. ఈ క్రమంలో పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

🔹“టికెట్ ఇస్తామన్నారని నమ్మాం”

మహేష్–కోమలత దంపతుల ఆరోపణలు

మహేష్ – కోమలత దంపతులు మాట్లాడుతూ, చొప్పదండి మున్సిపాలిటీలో చైర్మెన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో టీఆర్‌ఎస్ బీ–ఫామ్ ఇప్పిస్తానని మాజీ ఎమ్మెల్యే చెప్పారని ఆరోపించారు. ఈ క్రమంలో గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని ఆయన నివాసానికి పిలిపించుకుని చివరి క్షణంలో టికెట్ ఇవ్వకుండా అవమానించారని వాపోయారు.

“చివరిలో కేటీఆర్ చెప్పారని చెప్పి మాకు కాకుండా మరో వ్యక్తికి బీ–ఫామ్ ఇచ్చారు. టికెట్ ఖరారైనట్టు చెప్పి ఇంటికి పిలిపించుకుని ఇలా మోసం చేయడం అన్యాయం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగుతామని హెచ్చరిస్తూ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన చేపట్టారు.

🔹పోలీసుల జోక్యం – పరిస్థితి అదుపులోకి

ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహేష్ – కోమలత దంపతులను శాంతింపజేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి వారిని అక్కడి నుంచి పంపించారు.

🔹రాజకీయ వర్గాల్లో చర్చ – సోషల్ మీడియాలో వైరల్

ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు, ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చొప్పదండి నియోజకవర్గం అంతటా తీవ్ర చర్చకు దారి తీసింది. టికెట్ కేటాయింపుల విషయంలో పార్టీ నాయకుల తీరుపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

🔹బీ–ఫామ్ నిరాకరణపై మాజీ ఎమ్మెల్యే వివరణ

“రిజర్వేషన్ నిబంధనల ఉల్లంఘనే కారణం”

టికెట్ మోసం చేశారన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్పందించారు. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. చొప్పదండి మున్సిపాలిటీలో నాలుగో వార్డు ఎస్సీ జనరల్‌గా, ఐదో వార్డు ఎస్సీ మహిళగా రిజర్వ్ అయి ఉందని తెలిపారు.మహేష్ – కోమలత దంపతులు ఎస్సీ జనరల్ వార్డులో నామినేషన్ దాఖలు చేశారని, రిజర్వేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పార్టీ పరంగా బీ–ఫామ్ ఇవ్వలేకపోయామని వివరించారు. రిజర్వ్ అయిన వార్డును వదిలి ఇతర కేటగిరీలో పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా తన పాత్ర ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.

🔹మొత్తంగా

టికెట్ కేటాయింపుల వివాదం చొప్పదండి రాజకీయాల్లో వేడి పెంచింది. ఒకవైపు అభ్యర్థుల ఆరోపణలు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే వివరణతో ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular