జనోదయ,రామగిరి ఫిబ్రవరి 21:
కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మరణానంతరం ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న ఒక నిర్ణయం ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. రాధమ్మ నేత్రాలను దానం చేసి సమాజానికి మానవతా సందేశం ఇచ్చారు. మరణం అనంతరం కూడా జీవితాలను వెలిగించవచ్చని ఈ కుటుంబం చూపించింది.
లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో క్లబ్ డైరెక్టర్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి సమన్వయంతో, సదాశయ ఫౌండేషన్ సహకారంతో నేత్రదానం కార్యక్రమం నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రాలను సేకరించారు. రాధమ్మ కుమారులు శ్రీనివాస్, గణపతి, రాంశంకర్, కృష్ణమూర్తి సహా కుటుంబ సభ్యుల ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు హర్షించి అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేత్రదానం అంటే మరొకరి జీవితంలో వెలుగు నింపడం. మనం లేకపోయినా మన కళ్ల ద్వారా ఇంకొకరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. ప్రతి కుటుంబం ముందుగానే ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఒర్రె సదయ్య, మాజీ ఉపసర్పంచ్ నేము కనకయ్య, బూరుగు భూమయ్య, కుమారస్వామి తదితరులు హాజరై నివాళులు అర్పించారు. మల్యాల రాధమ్మ కుటుంబం తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.





