జనోదయ,కమాన్పూర్ ఫిబ్రవరి 17:
కమాన్పూర్ మండల పరిషత్ కార్యాలయం మంగళవారం ప్రజాస్వామ్య బాధ్యతల పాఠశాలగా మారింది.రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు–2026లో గెలుపొందిన ఉపసర్పంచులు,వార్డు సభ్యులకు చట్టపరమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ శిక్షణ 21 ఫిబ్రవరి 2026 వరకు కొనసాగనుంది.గ్రామ పాలనలో పారదర్శకత,సమర్థత,ప్రజా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
మండల అభివృద్ధి అధికారి ప్రియాంక మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రతి ప్రజాప్రతినిధి చేతిలో ఉండాల్సిన మార్గదర్శక గ్రంథమని పేర్కొన్నారు.సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు సభ్యుల అధికారాలు,బాధ్యతలు,నాయకత్వ లక్షణాలు,సమావేశాల నిర్వహణ,నిధుల వినియోగంలో జాగ్రత్తలు వంటి అంశాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు.గ్రామాభివృద్ధి కార్యాచరణలో సమన్వయం,పారదర్శకత,ప్రజల నమ్మకం కీలకమని ఆమె స్పష్టం చేశారు.
ఎంపీఓ సౌమ్య మాట్లాడుతూ ఈ శిక్షణతో నూతన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను చట్టబద్ధంగా,సమర్థవంతంగా నిర్వర్తించి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాలని ఆకాంక్షించారు.మండలంలోని నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచులు,వార్డు సభ్యులు పాల్గొని చర్చల్లో చురుకుగా భాగస్వామ్యమయ్యారు.

గ్రామ పాలనకు పునాది వేయే ఈ శిక్షణ శిబిరం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచే దిశగా కీలక అడుగుగా నిలిచింది.





