🔹ప్రశాంతమైన అడ్డగుంటపల్లికా? అల్లరల రాజ్యానికా? నిర్ణయం మీ చేతుల్లోనే
🔹పేదవాడినే కానీ మీ ఇంటి పెద్దకొడుకులా ఉంటా :మేకల మల్లేష్ హామీ
🔹ఒక్క ఓటు… ఐదేళ్ల భవిష్యత్తు – ఆలోచించి నిర్ణయం తీసుకోండి
జనోదయ,రామగుండం ఫిబ్రవరి 8:
58వ డివిజన్లో ఈసారి ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియగా కాకుండా, భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారాయి. అడ్డగుంటపల్లి, గణేష్ నగర్, సాధన నగర్ ప్రాంతాల ప్రజలు ప్రశాంతతతో కూడిన అభివృద్ధిని కోరుకుంటున్న తరుణంలో, కార్పొరేటర్ అభ్యర్థి మేకల మల్లేష్ ప్రజల మనసులను తాకే పిలుపునిస్తున్నారు.
“సింహం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి” అని ఆయన కోరుతున్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఓటు ద్వారా ఎన్నుకునే నాయకుడిపైనే ఉండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రశాంతమైన అడ్డగుంటపల్లి కావాలా, లేక గొడవలు–అశాంతి నిండిన అడ్డగుంటపల్లి కావాలా అన్న ప్రశ్నను ప్రజల ముందుంచుతున్నారు.
తాను పేదవాడినేనని, కానీ అధికారంలోకి వస్తే ప్రజల ఇంటి పెద్ద కొడుకులా బాధ్యత తీసుకుంటానని మల్లేష్ భావోద్వేగంగా చెబుతున్నారు. “మీ కళ్లముందే అభివృద్ధి కనిపించాలి… మీ కాళ్లకు దగ్గరగా సమస్యల పరిష్కారం జరగాలి” అన్నదే తన లక్ష్యమని అంటున్నారు. అవకాశం ఇస్తే ఊపిరి ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటానని హామీ ఇస్తున్నారు.
ఒక్కసారి వేసే ఓటు ఐదేళ్ల పాటు భారంగా మారకూడదని, మంచి సేవకుడిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు. ప్రజల కష్టం, ఆలోచన తెలిసినవాడే నిజమైన కార్పొరేటర్ అవుతాడని చెబుతూ, తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మాటలు 58వ డివిజన్లో ఓటర్లను ఆలోచింపజేసేలా చేస్తున్నాయి.





