మానవత్వాన్ని చాటిన మధురానగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు
గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీకురు అంజయ్య గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం వారికి కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఆదిపెళ్లి పృథ్వీధర్ గౌడ్ గారు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి మధురానగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే మధురానగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్పందించి తమ వంతు సహాయంగా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి బాధితుడు గీకురు అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది చేయాలని వారు సూచించారు.





