janodaya.in
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 7:51 pm Digital Edition : JANODAYA MEDIA

ఘనంగా శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

జనోదయ,రామగిరి మార్చి 19:

రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమం శ్రీ గోవర్ధనగిరి వేణు మనోహరాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆచార్యులు నూతన సంవత్సరానికి సంబంధించిన పంచాంగ విశేషాలను విశదీకరిస్తూ గ్రహగతులు, రాశి ఫలితాలు, శుభ ముహూర్తాలపై భక్తులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. కొత్త సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ఆహ్వానిస్తూ జీవన ప్రయాణాన్ని శ్రేయోమార్గంలో కొనసాగించాలనే సందేశాన్ని అందించారు.

తెలుగు ప్రజల నూతన సంవత్సర ఆరంభమైన ఉగాది పండుగ జీవితం కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో ముందుకు సాగాలని సూచిస్తుందని పేర్కొన్నారు. ఉగాది పచ్చడి ద్వారా సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే జీవన సత్యాన్ని తెలియజేస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షుడు వనమ రామచంద్రరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గంట వెంకటరమణారెడ్డి, కార్యదర్శి రవీందర్, మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.