janodaya.in
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 9:01 am Digital Edition : JANODAYA MEDIA

విద్యార్థుల్లో ట్రాఫిక్ చైతన్యం – అడ్డగుంటపల్లిలో అవగాహన కార్యక్రమం

🔹హెల్మెట్ ప్రాముఖ్యతపై పోలీసుల స్పష్టమైన సందేశం

జనోదయ, గోదావరిఖని ఏప్రిల్18:

స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హైస్కూల్‌లో ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ హరి శేఖర్,ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని పేర్కొంటూ,హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ వినియోగం,ఎడమ వైపున ప్రయాణించడం వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.18 ఏళ్ల లోపు వారు వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.

 

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచిస్తూ,కుటుంబ స్థాయిలో భద్రతా సంస్కృతి ఏర్పడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఒక విద్యార్థి తండ్రికి హెల్మెట్ లేకపోవడం గమనించిన పోలీసులు,ఆయనకు హెల్మెట్ అందజేసి భద్రతా సందేశాన్ని ప్రాయోగికంగా చాటి చెప్పారు.

కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సూర్యదేవర వెంకటేశ్వరరావు,ప్రిన్సిపాల్ సూర్యదేవర జ్యోతి,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ట్రాఫిక్ చైతన్యం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.