janodaya.in
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 9:36 pm Digital Edition : VAMSHI PADALA

కట్టుదిట్టమైన భద్రతల మధ్య స్ట్రాంగ్ రూమ్,లెక్కింపు కేంద్రాలు : డీసీపీ రామ్ రెడ్డి

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 9:

కట్టుదిట్టమైన భద్రతల మధ్య మున్సిపల్ ఎన్నికల తదుపరి ప్రక్రియలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణ అనంతరం జరిగే బ్యాలెట్ బాక్సుల భద్రత,లెక్కింపు ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న స్వీకరణ,పంపిణీ కేంద్రాలు,అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భద్ర గది,లెక్కింపు కేంద్రాలను డీసీపీ స్వయంగా పరిశీలించారు.ఈ తనిఖీల్లో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

తనిఖీ అనంతరం అక్కడి ఏర్పాట్లపై డీసీపీ సంతృప్తి వ్యక్తం చేస్తూనే,మరింత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.బ్యాలెట్ బాక్సుల పంపిణీ నుంచి పోలింగ్ అనంతరం వాటిని భద్ర గదిలో భద్రపరచడం వరకు ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.భద్ర గదుల వద్ద మూసివలయ కెమెరాల ఏర్పాటు, ఆయుధధారుల నియామకం,సూచిక ఫ్లెక్సీల ఏర్పాటు,లెక్కింపు సమయంలో అనుమతించాల్సిన వ్యక్తులు,వాహనాల నిలుపుదల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం సహించబోమని, సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే నేరుగా తనను సంప్రదించాలని సిబ్బందికి డీసీపీ స్పష్టంగా ఆదేశించారు.మొత్తం మీద ఎన్నికల అనంతర దశలో పారదర్శకత,భద్రతే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారని ఈ తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి.