janodaya.in
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 12:10 pm Digital Edition : VAMSHI PADALA

కమాన్‌పూర్ ఒకటో,రెండో వార్డులకు తాగునీటి సమస్య పరిష్కారం : సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ 

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 10:

 కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ రోడ్ వద్ద ఒకటో,రెండో వార్డులకు అనుసంధానంగా ఉన్న తాగునీటి పైప్‌లైన్ గతంలో సుభాష్‌నగర్‌లోని వాటర్ ట్యాంకర్‌కు కలిపి ఉండేది.పైప్‌లైన్ దూరం ఎక్కువగా ఉండటంతో ఆయా వార్డులకు సరైన స్థాయిలో నీరు అందక,స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఉదయం వేళ తాగునీటి కోసం ఇళ్ల ముందు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ సమస్యను ప్రజలు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ దృష్టికి తీసుకురావడంతో,ఆయన వెంటనే స్పందించారు.మంగళవారం ప్రత్యామ్నాయ ఏర్పాటుగా ఒకటో,రెండో వార్డుల పైప్‌లైన్‌ను సమీపంలోని హాస్పిటల్ వాటర్ ట్యాంకర్‌కు అనుసంధానం చేశారు.దీంతో నీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

సర్పంచ్ చొరవతో తక్షణమే సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల మౌలిక అవసరాలైన తాగునీరు,పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.