janodaya.in
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 8:19 pm Digital Edition : VAMSHI PADALA

సుల్తానాబాద్ హత్య కేసులో తుది తీర్పు – నిందితుడికి జీవిత ఖైదు

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 17:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసుకు పెద్దపల్లి జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది. దొంగతనం లక్ష్యంగా తన పెద్దమ్మను హత్య చేసిన కొదాటి సంపత్ రావుకు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం కఠిన నిర్ణయం ప్రకటించింది.
2019లో కోదురుపాక గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒంటరిగా నివసిస్తున్న తన పెద్దమ్మ చంద్రమ్మ ఇంట్లోకి రాత్రివేళ ప్రవేశించిన నిందితుడు, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దోచుకోవాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న పీఠతో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం బంగారు గొలుసును తీసుకుని పరారయ్యాడు.
మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను సేకరించి అభియోగపత్రం దాఖలు చేయడంతో కేసు కోర్టు విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడి నేరాన్ని నిర్ధారించి జీవిత ఖైదు విధించారు.
ఈ కేసులో ప్రజాపక్ష న్యాయవాది సమర్థవంతమైన వాదనలు వినిపించగా, పోలీసు అధికారులు సాక్ష్యాలను బలంగా సమర్పించారు. నేరస్తుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు బృందాన్ని పోలీస్ కమిషనర్ అభినందించారు.