జనోదయ, పెద్దపల్లి జూన్ 15:
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చర్మవ్యాధుల చికిత్సను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతో ఈ సదుపాయాలు ఆసుపత్రికి సమకూరినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
నూతన పరికరాల ద్వారా చర్మంపై ఏర్పడే పులిపిరులు,స్కిన్ ట్యాగ్లు వంటి సమస్యలను సులభంగా తొలగించడంతో పాటు ఇతర స్వల్ప చర్మ సంబంధిత వ్యాధులకు కూడా సమర్థవంతమైన చికిత్స అందించనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్ తెలిపారు.
ఇప్పటి వరకు ఇలాంటి చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చిన ప్రజలకు,ప్రభుత్వ ఆసుపత్రిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఊరట కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.పెద్దపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ప్రత్యేక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
ఆధునిక వైద్య సదుపాయాల విస్తరణతో జిల్లా ఆసుపత్రి సేవల ప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.