janodaya.in
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 6:12 pm Digital Edition : JANODAYA MEDIA

మధురానగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

 

గంగాధర, మార్చి 27 (జనోదయ):

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లోని శ్రీ రామ చంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

శ్రీ రామ నవమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు జయజయ నాదాలు చేస్తూ పాల్గొన్నారు. కళ్యాణ సమయంలో తలంబ్రాలు, పూలతో స్వామివారిని ఆడించడం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని  స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు పవన్ అయ్యగారు మాట్లాడుతూ  కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు.