## 30 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
##వార్డెన్ నిర్లక్ష్యంపై అర్ధరాత్రి వసతి గృహం ఎదుట విద్యార్థినీల ఆందోళన
జనోదయ, బెల్లంపల్లి, ఫిబ్రవరి 6:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలో గల బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ వల్ల 30 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి వసతి గృహంలో భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థులంతా కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. విద్యార్థులను తిరుమల, తమన్నా, శాలిని, కోమల, మాధవి, మల్లేశ్వరి, జయశ్రీ, రక్షిత, జోష్ణ లతోపాటు మరో 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థినిల కథనం ఎలా ఉంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సిబ్బంది భోజనం పెట్టారని చెప్పారు. భోజనంలో పెట్టిన మిల్లి మేకర్ కూరలో పురుగులు వచ్చాయని వాటిని చూసుకోక తినడంతో వాంతులు చేసుకున్నామని తెలిపారు. శుక్రవారం రాత్రి వార్డెన్ సుజాత రాలేదని చెప్పారు. రాత్రి 7 గంటలకు ఈ సంఘటన జరిగిందని, వార్డెన్ కు సమాచారం ఇవ్వడంతో ఆమె రాత్రి 10 గంటల వరకు వసతి గృహానికి స్థానికంగా ఉన్న ఆర్ఎంపి వైద్యుని పిలిపించి వైద్యం చేయించిందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రోజు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగులతో కూడిన భోజనాన్ని పెడుతున్నారని తెలిపారు. వార్డెన్ స్పందించకపోవడం పట్ల వారు పెద్ద ఎత్తున మండిపడ్డారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో విద్యార్థినిలు హాస్టల్ బయట కింద కూర్చుని తమ నిరసన తెలిపారు. ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థినిల పరిస్థితి తీవ్రంగా మారడంతో వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వసతి గృహం ఎదుట విద్యార్థినిలు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినిలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
