janodaya.in
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 4:46 pm Digital Edition : JANODAYA MEDIA

తాళం వేసిన ఇంటిలో చోరీ.. 13.75 తులాల బంగారం అపహరణ

గంగాధర, జూన్ 16 (జనోదయ): 
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నాగిరెడ్డిపూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు సుంకనపల్లి రమేష్ ఫిర్యాదు మేరకు, ఈ నెల 12న మధ్యాహ్నం తన భార్యతో కలిసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మామయ్యను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. మూడు రోజుల అనంతరం సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన తాళం పగులగొట్టి తలుపులు మూసి ఉన్నట్లు గుర్తించాడు.
అనుమానం రావడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తాళాలు పగులగొట్టి అందులో భద్రపరిచిన సుమారు 13.75 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాల సేకరణ చేపట్టారు. సంఘటన స్థలంలో వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది.