ఆయనది ఆత్మహత్య కాదు-ప్రభుత్వ హత్యే
శంకర్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గం
గంగాధర, ఏప్రిల్ 24 (జనోదయ):
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర మండలంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, శంకర్ గౌడ్ మరణం సాధారణ ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్కు ఘన నివాళులు అర్పించారు. ఈ ఘటన ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని సుంకె రవిశంకర్ విమర్శించారు. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన “ప్రభుత్వ హత్య”గా అభివర్ణించారు.
మృతుడి కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ సంస్థ హక్కులను కాపాడేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.